Monday, February 10, 2014

అనుభూతి1

                                                       


గోపాలం చిన్నప్పటి నుండి ఒక విలక్షణమయిన వ్యక్తీ.  ఎప్పుడూ , ధ్యానము, యోగము,  సాధన  ఇటువంటి పదాలనే వాడే వాడు. అలాగని తన చదువులో ఎప్పుడూ వెనుక పడ లేదు. విద్యార్థిగా ఎప్పుడూ ముందు బల్ల మీదనే కూర్చునే వాడు. చదువులో కూడా అందరి కంటే ముందు ఉండే వాడు. అందుకే వెనుక ఎన్ని వ్యాఖ్యలు చేసినా అందరూ గోపాలం ముందు మాత్రము జాగ్రత్తగా మాట్లాడే వారు. అంతే కాదు, గోపాలం చాలా స్నేహ శీలి. పరీక్ష ముందు రోజు కూడా తన క్లాస్ వాళ్ళే కాదు, వేరే వాళ్ళు ఎవరు వచ్చినా రాత్రంతా కూర్చొని అయినా వాళ్ళ అనుమానాలను తీర్చి పంపించే వాడు. అందుకే గోపాలం మీద నేరుగా కామెంట్ చేయడానికి ఎవరికీ ఇష్టముండేది కాదు.
           మాస్టర్  డిగ్రీ  చేసిన తరువాత ఒక కాలేజి లో లెక్చరర్ గా చేరినాడు. తల్లి దండ్రులు కూడా కొడుకు ఎక్కడ బైరాగులలో కలిసి పోతాడేమో అన్న భయముతో నచ్చ చెప్పి, లేక బెదిరించి పెళ్లి చేశాము అని, అనిపించినారు. భార్య పేరు రాజేశ్వరి. అందరూ రాజీ అని పిలిచే వారు. రాజీ అందరితో బాగా కలిసి పోయేది, చాలా కష్ట పడి ఇల్లును చాలా శుభ్రముగా యుంచేది. కానీ ఆమెకు ఒక విషయము అర్థమయేది కాదు. తన మొగుడు (ఇక్కడ భర్త అనే పదము వాడ తలచుకోలేదు ) ఉదయము సాయంత్రము క్రమముగ సంధ్యా వందనము చేసుకుంటున్నాడు, అన్ని విషయాలలో శ్రద్ధగా యుంటున్నాడు.  కానీ, అప్పుడప్పుడు, గంటల కొద్దీ కళ్ళు మూసుకొని కూర్చుంటాడు, అదేమంటే ధ్యానమంటాడు. కాసేపు కబుర్లు చెబితే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థము కావటము లేదు. ఇదంతా ఏమిటో తెలుసుకోవాలని అనిపించ లేదు, అందుకని వివరాలను అడుగ లేదు. కానీ తనకు చాలా చిరాకు వేసేది.  
          అద్దె ఇళ్ళలో యున్న గోపాలం ఒక చోటు చూచుకొని అక్కడే తన అనుస్థానాలను చేసుకొనే వాడు, వీలయినప్పుడల్లా ధ్యానము చేసుకొనే వాడు. చాలా సార్లు రాజీ చేత కూడా ధ్యానము చేయించాలని చూచినాడు. తను ఎటువంటి ఆసక్తి చూపించ లేదు. అంతే కాదు, తను ధ్యానము చేసే టప్పుడు బాగా ఆకలి వేస్తే, కేకలు వేసేది. అందు వలన ధ్యానము చేసేటప్పుడు, రాజీ కి ఆకలి వేసిందేమో లేదా వేస్తుందేమో అన్న భయము కూడా తనలో యుండేది. అందుకని, ఆ సమయములో ధ్యానము కుదిరేది కాదు.
          ఈ లోపల కుటుంబము కాస్త పెరగడము, పిల్లలు, వారి వ్యవహారాలూ, వీటితో గోపాలం తన వ్యాపకాలలోకాస్త వెనుక బడినాడు.. పిల్లలు ఎదిగి, దూరపు ఊళ్ళలో ఇంజనీరింగ్ చదువుల్లో చేరిన తరువాత, మళ్ళీ కాస్త వెసులు బాటు దొరికింది. పిల్లలు దూరమయిన తరువాత రాజీ కి కూడా  ఎదో కాస్త వెలితి కన బడ సాగినది.  అందుకని, ఇప్పుడు ధ్యానమంటే ఏమిటి? ఎలా చేయాలి? చేస్తే ఏమొస్తుంది? ఇటువంటి సిద్ధాంతపు ప్రశ్నలు వేసేది. అభ్యాసముకు మాత్రము బద్దకమే, ఇంట్లో పనులు చక్క బెట్టడానికి మాత్రము బద్ధకించేది కాదు.
          తనుండేది, అద్దె ఇండ్లలో. ఇల్లు మారిన ప్రతి సారీ, కొత్త వాతావరణము లో ధ్యానము కుదిరేది కాదు. ఆ సమయములో బాంకులు ఇల్లు కట్టుకోవడానికి అప్పులు ఈయడము మొదలు పెట్టినాయి.  ఒక స్థలము కొని బాంకు అప్పు తో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. అందులో ధ్యానము చేసుకోడానికి ఒక చిన్న గదిని తన ఆధీనములో ఉంచుకున్నాడు. అక్కడ మరే ఇతర పనీ చేయడానికి ఇష్ట పడే వాడు కాదు. అప్పుడప్పుడు తనకు బంధువులు ఎక్కువయినపుడు, తను మాత్రము ఆ గదిలో పండుకొనే వాడు. ఈ విషయములో రాజీ కి తనకు వాదనలు వచ్చేవి. చివరకు రాజీ పడి పోయే వారు.
          ఒక రోజు రాజీ ఏ బుద్ధి మీదుందో కానీ గోపాలాన్ని నిలేసింది.
ఇన్నాళ్ళూ ధ్యానము, ధ్యానము అంటూ కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు కదా!  ఏమయినా కనిపించినడా?        
  అంటే, కనిపించేదేమిటి?
మరి అలా కూర్చుంటే ఏమి వస్తుంది?
ఆ క్షణము కాస్త ఆనందముగా యుంటుంది.
నాతో వచ్చి, కూర్చోని, టి వి ప్రోగ్రాములు చూడండి.  ఆనందము రాదా ఏమిటి?
అలా కాదే, ధ్యానము చేస్తే మన ఆధ్యాత్మిక స్థితి  పెరుగుతుంది.
మరి, రొజూ సంధ్యా వందనము చేస్తున్నారు కదా!  దాని వలన ఆ స్థితి పెరగదా ఏమిటి?  ఇది కూడా ఎందుకు? గంటల కొద్దీ నిశ్శబ్దముగా అలా కూర్చుంది పొతే, ఇంట్లో ఎవరుండేది కూడా తెలియటము లేదు.
మూడవ కన్ను తెరుచుకుంటుందని, మంచి దర్శనాలు వస్తాయని చెప్పి  మెప్పించే శక్తి తనకు లేదు. అందుకే తను నిశ్శబ్దముగా యుండి పోయినాడు. తనే మళ్ళీ మొదలు పెట్టినది.
మీరు కళ్ళు మూసుకొని ఏమి చూస్తారు?
కళ్ళ ముందు ఏమి కనిపించినా గమనిస్తూ ఉంటాను.
ఇంతకూ ఏమి కనిపిస్తుంది? దాని వలన వచ్చే లాభ మేమిటి?
చీకటి వెలుతురు మధ్య ఏవేవో అర్థము కానివి కనిపిస్తాయి, అయినా వాటినే గమనిస్తూ యుంటాను.
దాని వలన వచ్చే లాభమేమిటి?
బయట ఏమి లభిస్తుందో తెలియక పోయినా, కనిపించిన వాటిని గమనించడమే సాధన.
ఏమో? ఏమి చేస్తునారో, ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఇంతకూ మీకు ఇలా చేయాలని చెప్పిన ప్రబుద్ధుడు ఎవడు?
ఆయనను గూర్చి అలా మాట్లాడ కూడదు.  అయన యొక మహా యోగి.
ఇంతలో పక్కింటావిడ ఎదో అవసరము కొద్దీ వచ్చింది.  రాజీ తో మాట్లాడుతూ,
ఈ రోజు శివాలయములో శివానంద స్వామి ఉపన్యాసముందట. వస్తారా?
వాళ్ళు  ఏమి చెబుతారో, ఏమో, నాకేమి అర్థమవుతున్దండీ?
ఏమో , ఆయన రాజ యోగము గూర్చి మాట్లాడుతాడుట. చాలా విషయాలు చెబుతారుట. చాలా మంది చెప్పినారు. మేము కూడా వెళుతున్నాము. ,  అంటూ వెళ్లి పోయింది.
రాజ యోగమనే మాట  గోపాలాన్ని పట్టేసింది.
రాజీ! నీవు కూడా  రావచ్చు కదే! నాకు వెళ్ళాలని యున్నది.
ఎందుకు? మీ చిన్నపుడెవరో కళ్ళు మూసుకొని కుర్చోమన్నారని, మీరు ఇప్పటి వరకు ఆ పనిని వదలి పెట్ట లేదు. అలా చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పటి వరకు మీ దగ్గిర నుండి జవాబు లేదు. ఇప్పుడిక్కడికి వెళ్లి వచ్చిన తరువాత, మీరా గదిలో, నేనీ గదిలో కళ్ళు మూసుకొని కూర్చుందాము, ఎవరు పిలిచినా పలుకకుండా గడియ వేడుకొని..
ఎందుకలా అనుకుంటావు? నీ ప్రశ్నకు ఈయన నుండి జవాబు వస్తుందేమో? 
ఇంతకూ ఈయన రాజ యోగము గూర్చి చెబుతారో, రాణీ యోగము గూర్చి చెబుతారో? సరే, మీరింతగా అడుగుతున్నారుగా! నేనూ సిద్ధమవుతాను. ఆ పేరుతొ నన్నా మీరొక రోజు మీ ధ్యానము మానేసి, శివాలయానికి వస్తారు కదా! అదే భాగ్యము.
 ------------------------------------------------------------------------------------------------------------------------
          దేవాలయ ప్రాంగణ మంతా క్రిక్కిరిసి యున్నాది. శివానంద స్వామి ఉపన్యాసము మొదలయింది.
  భగవంతుడు సర్వాత్మకుడు, అంటే అందరితో, లేదా అందరిలో ఉండే వాడు ఆయనే.
  సర్వ వ్యాపి, అంతటికి వ్యాపించేది ఆయనే.
సర్వ శక్తిమంతుడు. అందరిలో యుండేది ఆయన శక్తే.
అసలయిన మానవుడిని, అంటే మనలను కొంత సేపు ఆ పేరుతొ పిలువకుండా యాత్రీకుడిగా  భావిద్దాము.
తను ఎక్కడి నుండి వచ్సినాడో, ఏ మూలము నుండి వచ్సినాడో మఱచి పోయినాడు. ఆ మూలమును పట్టుకోవాలని సుదీర్ఘ యాత్ర మొదలు పెట్టినాడు. అందుకే ఈ పాంచ భౌతిక దేహము లోనికి తల్లి దండ్రుల సంకల్పము మరియు యోగము ద్వారా ప్రవేశించినాడు. ఆ విధముగా భౌతిక ప్రపంచానికి కట్టు వడి పోయినాడు.
ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీకు అర్థ రహితాలుగా విచిత్రాలుగా కనిపిస్తాయి. కాస్త ఓపిక తెచ్చుకొని వింటే అన్నీ అర్థమవుతాయి. అంతే కాదు ఇవన్నీ మన ప్రాచీన ఋషుల నిరంతర పరిశీలనలో తేలిన నిజాలు. వీటిని ఋజువు చేయ గలిగిన సాధనాలు ఇప్పుడు ఎన్నో వచ్చినాయి.
ఈ యాత్ర మొదలయింది.
ఒక్క జన్మ కాదు, ఎన్నో జన్మలు.                              
ఒక్క చోటు కాదు, ఎన్నో ప్రాంతాలు.
ఒక్క కష్టము కాదు, ఎన్నో సుదీర్ఘమయిన  క్లిష్ట మయిన అనుభవాలు.
వీటిని ఎదుర్కుంటేనే తను లక్ష్యాన్ని చేరుకుంటాడు.
ఈ విధముగా తను తన తండ్రి అయిన భగవంతుడి లాగా సర్వాత్మకుడు, సర్వ వ్యాపి, సర్వ శక్తిమంతుడు అని తెలుసుకుంటాడు. ఇన్ని అనుభవాల తరువాత తన తండ్రి ఎదిగిన తన బిడ్డను కౌగిలి లోనికి తీసుకుంటాడు. భక్తి మార్గములో దీనినే సారూప్యము, సామీప్యము, సాయుజ్యము అని అంటారు. ఇక్కడ నేను పూర్తి వివరణకు వెళ్ళుట లేదు.
మొదటి జన్మలలో జంతువులను వేటాడి, వాటి మాంసాన్ని ఆహారముగా స్వీకరించినాడు. తరువాత పక్షుల లాంటి వాటిని చూచి, ధాన్యపు గింజలను ఆహారములో కలుపుకున్నాడు.
సుఖాలను అనుభవించుటకు ఏర్పడిన బంధము పిల్లల మీద ప్రేమ గా మారుతుంది.
సమాజము పటిష్థముగా, శాంతివంతముగా ఉండాలంటే కొన్ని లక్షణాలు అందులో వ్యక్తులకు ఉండాలి.
మొదట వచ్చేది ఆశ. అంటే అది తనకు కావాలి. అది తనకు అందక పొతే ఆవేశము. ఎన్నో వైఫల్యాల తరువాత ఎందుకు ఇలా జరుగుతున్నాదని ఆలోచించడము మొదలుపెడతాడు. ఆలోచన మనస్సు యొక్క లక్షణము. అంత వరకు జంతువుల వలె ఆవేశముతో ఎగబడే యాత్రికుడు ఈ విధముగా మనస్సును ఏర్పరచుకొని మానవుడవుతాడు.  మానవుడు కూడా యాత్రికుడే అన్న విషయాన్ని మనము మరచి పోకూడదు.
ఇవన్నీ ఒక్క జన్మలో జరుగవు, కొన్ని జన్మల పర్యంతము జరుగుతుంది.
వెంటనే మరొక ప్రశ్న వస్తుంది. మనిషి చని పోయిన తరువాత అతడి దేహాన్నితగుల బెట్టి వేస్తారు. మళ్ళీ ఆ వ్యక్తీ పుట్టిన తరువాత అన్నీ, మళ్ళీ అనుభవించ వలసిందేనా? ఒక జన్మకు మరొక జన్మకు సంబంధము ఎలా వుంటుంది?
తల్లి దండ్రులు ఇచ్చిన దేహాన్ని స్థూల లేదా పార్థివ దేహమని అంటారు. అంటూ తన దేహాన్ని చూపించినారు. పాదో అస్య విశ్వా భూతాని, త్రిపాద్ అస్య అమృతం దివి అని  పురుష సూక్తము చెపుతుంది. అంటే ఈ విశ్వములోఒక వంతు మాత్రమే మన కంటికి కన బడుతుంది ఉంటారు. మిగిలిన మూడు వంతులు దివిలోయుంటాయి, అంటే కళ్ళకు కనిపించవు. అందుకే నేను కళ్ళతో చూస్తే కానీ నమ్మనన్న వాడు నిజాన్ని ఎప్పుడూ చూడ లేడు.
కనిపించే ఈ వంటికి కనిపించని భాగాలు ఉన్నాయి. ఈ దేహాన్ని విశ్వానికి అనుసంధానము చేస్తూఒక దేహముంటుంది. దీనిని ఎథీరిక్ జంట అని పాశ్చాత్యులంటే సూక్ష్మ దేహమని వేద ఋషులు అన్నారు.
మనకు ఆవేశము కలిగినపుడు, అందుకనుగుణముగా స్పందించేమరొక దేహమున్నది. తీవ్రమయిన కోరికలకు ఆవేశాలకు అది తీవ్రముగా స్పందిస్తుంది.  ఇలాంటి స్పందన యున్నపుడు మనము వివేకాన్ని కోల్పోతాము.  ఈ దేహాన్ని ఆస్త్రల్ దేహమని పాశ్చాత్యులు, కామ దేహమని భారతీయ ఋషులు పిలిచినారు.
ఈ దేహము మనము నిద్ర పొతున్నపుడు  లోకమంతా తిరిగి సమాచారాన్ని సేకరిస్తుంది. దీనినే కామ దేహ గమనము లేదా యాస్త్రల్ ట్రావల్ అని అంటారు.దీనిని నియంత్రించి ఉపయోగించు కో గలిగితే  మనము ప్రపంచములో ఏ ప్రాంతములో ఎప్పుడు ఏమి జరుగుతుందో అతి తక్కువ కాలములో తెలుసుకొని రాగలము.
మనము ప్రశాంతతను తెచ్చుకోగలిగితే , మనలో వివేకము పెరిగే మనస్సు ముందుకు వస్తుంది. ఇది నియంత్రణ లేక పొతే భూతము లాగా మనలను చంపేస్తుంది. నియంత్రణ యుంటే స్వర్గాన్ని భూమికి దింపుతుంది.
          మన ప్రాచీన ఋషులు వీటిని త్రిపురాల నియన్నారు.ఇవి విచ్చల విడిగా యున్నపుడు వాటిని నియంత్రించడానికి మహా దేవుడే దిగి రావలసి వచ్చింది. అదే త్రిపురాసుర సంహారము. ప్రతి జన్మ చివర త్రిపురాసుర సంహారము జరుగుతూనే యుంటుంది.
          అయితే సూక్ష్మ దేహము తన యొక్క సమాచారాన్ని కామ దేహములోను, కామ దేహము తన యొక్క సమాచారాన్ని మనో దేహములోను, దాచి పెడుతాయి. ఈ అనుభవాలు కాస్త పేరుగా గానే వాటిని నిక్షిప్తము చేస్తూ కారణ దేహము లేదా ఆంగ్లములో కాజల్ బాడి ఏర్పడుతుంది. మనో దేహము తన అనుభావాలన్నిటిని కారణ దేహములో దాచి పెడుతుంది. మనిషి చని పోయిన తరువాత నాశనము కానిది కారణ దేహమొక్కటే. ఇదే గత జన్మలోని అనుభవాలను తరువాత జన్మకు చేరుస్తుంది. మనము మాట్లాడే కర్మ అంతా ఈ కారణ దేహము ద్వారానే అందించ బడుతుంది.
          మనిషికి మొదటి దశలో కామ్య సుఖాలు, తిండి, నిద్ర  ఎక్కువగా యుంటాయి. ఇవి మరీ ఎక్కువయితే నైరాశ్యముఏర్పడి ఇంకా ఏమున్నదని అన్వేషణ మొదలు పెడుతాడు. అక్షరాల సంపుటితో మంత్రం ఉచ్చారణ ద్వారా, కఠిన దీక్షల ద్వారా ఊగి పోయే కామ దేహము కొన్ని పనులను చేసి పడుతుంది. ఇక్కడ కొంత మంది మంత్రాలను ఇలా కూడా ఉపయోగిస్తారని చెపుతున్నాను. కాని వాటిని సాత్వికముగా వాడితే అద్భుతము అయిన ప్రయోజనాలు లభిస్తాయి.
          మళ్ళీ అసంతృప్తి కలిగి ఈ స్థితిని కూడా దాట వలె నని అనిపిస్తుంది. బురద నీటిలో ఏదీ కనిపించదు. కదలని స్వచ్చమయిన  నీటిలో అన్నీ కనిపిస్తాయి. అందుకని ఆవేశాన్ని నియంత్రించు కోవాలని అనుకున్నాడు. అప్పుడు మన దృష్టిని స్థిరముగా ఒక చోట యుంచాలి. అది మనతో నిరంతరాయముగా ఉండేదిగా ఉండాలి. అది శ్వాస కావచ్చును. అపుడు ఆవేశము తగ్గుతుంది. మనస్సు ఖాళీగా ఉండుటకు ఇష్ట పడదు. అది కల్లు/సారాయి తాగిన కోతి లాటిది. దానికి పని పెట్టాలి. ఇందు కోసమే విజ్ఞాన భైరవ తంత్ర లో పార్వతీ దేవికి శివ భగవానుడు ఉపదేశించిన మొదటి సాధన  శ్వాస మీద ధ్యాస.
          అప్పుడు మన మనస్సు అనే నీటి కొలనులో బురద క్రిందికి దిగుతుంది.  అడుగున యున్న రహస్యాలు సుస్పష్టముగా కన బడుతాయి.
          ఒక యజమానికి నలుగురు పిల్లలు ఉన్నారనుకుందాము. ప్రక్కింటి స్నేహితుడి కోరిక మీద వారికి సాయము చేయుటకు ఇంట్లో జిలేబి చేసినారు. నాలుగేండ్ల చిన్న కొడుకు బయట ఆటల నుండి పరుగుతో వస్తూ  ఎదురుగా జిలేబి చూచి అమ్మ వద్దని చెప్పే లోపల ఎవరితో చెప్పకుండా ఒకటి నోట్లో వేసుకొని, జిలేబి భలే యుందమ్మా!  అని చెప్పినాడు. ఇక అమ్మకు అవి మనకు కాదు అనే అవకాసము కూడా ఈయ లేదు.
          ఆరేండ్ల మూడవ కొడుకు నాకూ జిలేబి కావాలని గొడవ చేసి, మనకు  కాదంటే ఇల్లంతా పీకి పందిరి వేసే స్థితి లోకి తీసుకు వచ్చి, జిలేబి తీసుకొని తిన్నాడు.
          ఎనిమిదేండ్ల రెండవ కొడుకు అమ్మకు నాన్నకు తిన్నగా కబుర్లు చెప్పినాడు. దృష్టి మాత్రము జిలేబి మీదనే యుంది. అయినా ఆవేశ పడకుండా  ప్రక్కింటి వాళ్ళ కోసము చేసిన జిలేబి మనము తిన గూడదు అని తమ్ముళ్ళకు చెప్పి బుజ్జగించినాడు.. తల్లికి జాలి వేసి వాడికి కూడా ఒక జిలేబి ఇచ్చినది.
          పదేండ్ల మూడవ కొడుకు ఇవంతా తన దైనందిని (డైరి ) లో వ్రాసుకున్నాడు.
 ఇందులో పెద్ద వాడు కారణ శరీరాన్ని, రెండవ వాడు, మనో శరీరాన్ని, మూడవ వాడు కామ శరీరాన్ని, నాల్గవ వాడు భౌతిక శరీరాన్ని సూచిస్తారు. వారి వయస్సులు వారి పరిణామ స్థితిని సూచిస్తాయి.
ఈ సమయములో గుడిలో గంటలు మ్రోగినాయి. నైవేద్యానికి అన్నే సిద్ధమయినాయని ఉపన్యాసాన్ని ఆపి వేసినారు. మరునాడు అదే సమయానికి ఉపన్యాసము కొన సాగుతుందని ప్రకటించినారు

No comments:

Post a Comment