Monday, November 14, 2016

మన చరిత్ర2

                                                    

                           భారత దేశ చరిత్ర- ఒక పరిశీలన

బ్రిటీషు వారు రాక ముందు భారత దేశమునకు చరిత్ర లేదు.
మొట్ట మొదటి సారి భారత దేశ చరిత్ర వ్రాసినది ఆంగ్లేయులు
భారత దేశము మొట్ట మొదట సారి ఒక జాతిగా ఏర్పడినది ఆంగ్లేయుల కాలములోనే.
మన దేశములో ప్రముఖులుగా చెప్ప బడుతున్న కొందరు ఈ మాటలనే మాట్లాడుతారు. చరిత్ర పుస్తకాల నిర్మాణముపై వారి ప్రభావము చాలా ఉన్నది. ఈ నాటి చరిత్ర విద్యార్థులు వారి మాటలనే నమ్ముతున్నారు. ఈ విధముగా వారు తమ గతాన్ని మరచి పోయి తమ సాంస్కృతిక సంపదకు దూరమవుతున్నారు. ఇటువంటి స్థితి ఎందుకు వచ్చినది?
విదేశీ దాడులకు ముందు ఈ దేశము సాంస్కృతికము గా ఒకే మార్గములో నడుస్తూ ఉండేది. ఎంత మంది పాలించినా , ఎన్ని చిన్న చిన్న రాజ్యాలున్నా ఎన్ని ఆరాధనా పద్ధతులు ఉన్నా దేశము అంతటా ఒకే సాంప్రదాయములో ఉండేది.  మొత్తము భూమిని పాలించిన చక్రవర్తులను గురించిన పూర్తి విషయాలు ఉన్నాయి. అతి ప్రాచీన కాలాన్ని వదిలి వేస్తే, అయిదు వేల సంవత్సరాల క్రిందట ధర్మ రాజు దేశమును ఒకటిగా చేసి  పాలించినాడు. తిరిగి ముక్కలయిన దేశాన్ని విక్రమార్కుడు కలి యుగాబ్ది ౩౦౪౫  లేదా క్రీస్తు శకము ౫౭ లో ఒకటి చేసి పాలించి యుగ పురుషుడు అయినాడు. తిరిగి ముక్కలయిన దేశాన్ని ౧౩౫ సంవత్సరాల తరువాత ఆయన ముని మనుమడు అయిన శాలి వాహనుడు ఒకటి చేసి మళ్ళీ శక పురుషుడుగా పేరును పొందినాడు.  మయుడు, ఆర్యభట్టు, వరాహ మిహిరుడు, భట్టోత్పలుడు, బ్రహ్మ గుప్తుడు, భాస్కరుడు లాంటి శాస్త్రజ్ఞులు ఏంటో మంది ప్రశస్తిని పొందినారు.
మన దేశము మీద దాడి చేసిన అత్యంత ప్రాచీనులలో కాల యవనుడు ఒకడు. ఆ తరువాత కూడా డెమెట్రియస్, మిన్యాండర్ లాటి గ్రీకుల దాడి జరిగిన రోజులలోనే వారు అయోధ్య వరకు వచ్చినారు. కానీ వారిని తిప్పి కొట్టినారు. తరువాత వచ్చిన అలెక్జాండర్ సింధు నదినే దాట లేక పోయినాడు. ఆయనను నిలవరించినది గుప్త వంశానికి చెందిన సముద్ర గుప్తుడు.(క్షమించాలి, పాశ్చాత్యుల వ్రాతలనే నమ్మే వారు ఇది తెలుసుకోవాలి.)అటు  తరువాత పర్షియా, గ్రీకు దేశాలను ధ్వంసము చేసిన హూణులను స్కంద గుప్తుడు సింధు నదిని దాటి రాకుండా నిలవరించినాడు. కాని విదేశీయులు వ్రాసిన చరిత్రలో ఆయనను , ఆయన విజయాలను పూర్తిగా మరిచి పోయినారు. విక్రమార్కుడు,  శాలి వాహనుడి కాలములో ఈ దేశము కాస్త నిలదొక్కుకున్నది.  క్రీ.శ.౮వ శతాబ్దములో తిరిగి అరబ్బు దేశాలనుండి దాడులు మొదలు అయినాయి.   
ఈ దాడులు జరిగి సుమారుగా వేయి సంవత్సరాలలో వారి ప్రభావములో ఉన్నప్పటికీ భారతీయ సామాజిక ఏకాత్మకత చెక్కు చెదర లేదు. టన్నుల బంగారము కొరకు స్పెయిన్ దేశస్థులు మాయా నాగరిక సమాజమును ఎలా ధ్వంసము చేసినారో అందరికీ తెలుసును. అదే విధముగా భారత దేశములో ఉన్న ఏకాత్మకతను దెబ్బ కొడితే తప్ప ఇక్కడ నిల దొక్కుకో లేమని బ్రిటిష్ వారు భావించి ఆ దారిలో ఎన్నో కుట్రలు చేసినారు. దేశాన్నీ వేర్వేరు వర్గాలుగా విభజించి , వారి మధ్య ద్వేష భావాలను రగుల్కొలిపి తాము స్థిర పడాలని అనుకున్నారు. ఇందుకు ఎన్నో రకాలయిన ప్రణాళికలు వేయ బడినాయి. అందులో ఒక భాగము ఆర్య ద్రావిడ సిద్ధాంత ప్రతిపాదన.
ఈ దేశములో మొదట తురీయులు అనబడే వారు ఉండే వారుట. తరువాత  ద్రవిడులు అనబడే వారు వచ్చి, ఈ దేశాన్నీ ఆక్రమించి ఆ  తురీయులను  కొండల పైకి, అడవుల లోనికి తరిమి వేసినారుట..చివరకు ఎక్కడో ఆసియా మైనర్ నుండి ఆర్యులు అన బడే వారు వచ్చి, ద్రవిడులను దక్షిణ భారత దేశానికి తరిమి వేసి ఉత్తర భారత దేశాన్ని ఆక్రమించుకున్నారుట. అయితే ఇక్కడ చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఒకరి వెంబడి ఒకరు వచ్చి పాత వారిని వేరే చోటకు తరిమి వేసే సంప్రదాయము మనకు లేదు. నిజానికి బ్రిటిషు వారు అమెరికా ను ఆక్రమించి రెడ్ ఇండియన్లను అడవుల పాలు చేసినారు. వారి సంప్రదాయాలను నాశనము చేసి వారిని దరిద్ర స్థితికి పంపినారు. అందుకే వారు ఎవరైనా అలాగే చేస్తారనే తత్త్వము లో నుండి బయటకు రా లేరు. ఆ తత్త్వము ఇంకా అలానే ఉంది. ఉదాహరణకు మన దేశములో కథలలో ,చివరకు సినిమాలలో కూడా భూమికి బయట నుండి వచ్చిన వారు భూమి మీద ఉన్న వారితో స్నేహముతో ఉంది , వారికి ఎంతో సహాయము చేసి, వారి నుండి తిరిగి సహాయమును పొందినట్లు ఉంటుంది. కానీ, అమెరికన్లు తీసే సినిమాలలో ఇప్పటికీ తాము మాత్రమె భూమికి రక్షకులయినట్లు, ఇతర గ్రహాలనుండి, మరియు నక్షత్రాలనుంది వచ్చే వారు భూమిని నాశనము చేయడానికి వచ్చినట్లు ఉంటాయి.   Independence day  సినిమా ఒక ఉదాహరణ. ఇంకొక ప్రశ్న. ఆర్యులు అంతకు ముందు ద్రవిడులు  తురీయులను చేసినట్లు వారిని కొండల మీదికి తరిమి వేయ లేదేమి? అందుకు వారు చెప్పే జవాబులు నమ్మ దగినవి గా ఉండవు. ఇటువంటి విచిత్రమయిన సిద్ధాంతాన్ని కోట వెంకటాచలము గారు, మరియు నారాయణ శాస్త్రి గారు ఖండిస్తే, వారికి మాట్లాడే అవకాశము కూడా ఈయ లేదు.
           భారత దేశములో ఋషుల ద్వారా వ్రాయ బడిన పురాణాలలో గతములో పాలించిన రాజుల చరిత్ర తో బాటు భవిష్యత్తులో పాలించే పాలకుల చరిత్ర కూడా ఈయ బడినది.  కానీ ఇందులో కొన్ని ప్రక్షిప్తాలు లేక పోలేదు. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకే పరంపర కనబడుతుంది. లభ్యమవుతున్న భిన్న ప్రతులను పరిశీలిస్తే ఒకే చరిత్ర కనబడుతుంది. అందులో కొన్ని ప్రధాన సంఘటనలకు అప్పటి గ్రహ నక్షత్ర స్థితులను కూడా వివరముగా ఇచ్చినారు. ఖగోళ శాస్త్ర పరిజ్ఞానమున్న వారు ఎవరైనను దీనిని అనుసరించి కాల నిర్ణయము చేయ వచ్చును. సప్తర్షి మండలములో చతురస్రము కాక మిగిలిన మూడు చుక్కలను పొడిగిస్తే  అవి  చంద్ర కక్ష్యను తాకే చోట ఉన్న నక్షత్రమును కాలమానముగా వాడుకున్నారు. ఈ బిందువు వంద సంవత్సరాలకు ఒక నక్షత్రము మారునట్లు వరాహ మిహిరుడు చెప్పినాడు. అంతే కాదు. విషువద్బిందువు కాలవ్యవధిని అనుసరించి మారుతుంది. ఈజిప్టు నాగరికత ఉన్నత దశలో ఉన్నపుడు ఇది డ్రాకో అంటే నరక నక్షత్రము లో ఉండేది ఇప్పుడు అది అభిజిత్ అంటే వేగా నక్షత్రములో ఉంది. ఈ లెక్ఖ కూడా కాల నిర్ణయానికి ఉపయోగ పడుతుంది. కానీ ఇవేవీ ఆ నాటి నకిలీ చరిత్ర కారులకు నమ్మ దగినవిగా అనిపించా లేదు.
ప్రాచీన భారతీయ ఖగోళ విజ్ఞానము గురించి  ఒక (పేరు గుర్తు లేదు. తరువాత చెపుతాను) ఫ్రెంచి ఖగోళ శాస్త్రజ్ఞుడు ఇలా అంటాడు.”గత ౪౫౦౦ సంవత్సరాలలో హిందువులు గణించి తెలిపిన గ్రహ నక్షత్ర స్తానములు కాసిన్ మరియు మేయర్ ఇచ్చిన పట్టీలనుండి ఒక నిముషము కూడా తేడా చూపించుట లేదు. భారతీయ శాస్త్రజ్ఞులు ఇచ్చిన చంద్రుడి గమనము టైకోబ్రే పరిశోధనలకు సరిపోతుంది. నిజానికి అటువంటి చలనము అలెగ్జాండ్రియా లో శాస్త్రజ్ఞులకు గానీ, అరబ్బు శాస్త్రజ్ఞులకు గానీ తెలియని విషయము. హిందువుల ఖగోళ శాస్త్రజ్ఞానము అతి ప్రాచీనమయినది. ఈజిప్టు, గ్రీకు శాస్త్రజ్ఞులే గాక యూదువులు కూడా ఖగోళ  రహస్యాలను అక్కడ నుండే గ్రహించినారు. కాని, భారతీయులు గ్రీకుల నుండి ఖగోళ శాస్త్ర విజ్ఞానము గ్రహించినారన్న ప్రచారము అందరి మనసులలో చొచ్చుకొని పోయినది. సమగ్రముగా పరిశీలిస్తే ఈ ప్రచారము ఎంతగా సత్య దూరమో తెలుస్తుంది.”
భారతీయ చారిత్రక సత్యాలు మార్చి వేయుటకు ఎన్నో ప్రయత్నాలు జరిగినవి. కొన్ని సంఘటనలను జరగనే లేదన్నట్లు తీసి వేసినారు. కొందరు చారిత్రక పురుషులు అసలు లేరని నమ్మించుటకు ప్రయత్నించినారు.(ఇది మరొక చోట వివరించ బడుతుంది) తమ అభిప్రాయాలు బల పరచుటకు సరికొత్త ఋజువులు కల్పించినారు.
 విలియం జోన్స్ అను పేరు గల బ్రిటిష్ చరిత్ర కారుడు భారత దేశ చరిత్ర యొక్క పునర్నిర్మాణమునకు విష్ణు పురాణమును ఆధారము చేసుకొని పరిశీలించినాడు. తన పరిశీలన లో మౌర్య చంద్ర గుప్తుడు కలి యుగాబ్ది ౧౫౬౮ లేదా క్రీస్తు పూర్వము ౧౫౩౪ లో పరిపాలన చేసినట్లు నిర్ణయించినాడు. అంతే గాక అలెగ్జాండర్  దండ యాత్రకు ౬౦౦ సంవత్సరాల ముందు నుండి  మన సమీప దేశము బాక్ట్రియా ను పాలించిన వారి వంశ వృక్షము (dabistaan Document) ను  కూడా ప్రకటించినాడు. తరువాత అతడి మీద ఎటువంటి వత్తిడులు వచ్చినాయో తెలియదు. హఠాత్తుగా ఈ చరిత్ర కాలములు నమ్మ దగినవి గా లేవని అన్నారు.  యూరప్ లో తయారయిన ఒక రహస్య ప్రణాళికను అనుసరించి భారతీయ చరిత్ర కాలములను తారు మారు చేయుటకు పూనుకున్నాడు.

         

No comments:

Post a Comment