Saturday, September 10, 2016

ఈశావాస్య ఉపనిషత్తు

                       

వేదములు అన్నీ యథార్థమునకు  ప్రతీకలు అయితే  ఉపనిషత్తులు  వేద తత్వాన్ని మానవ జాతి దగ్గరకు చేర్చే ప్రణాళికలు.  కొంత మంది అనెదరు ,” ఉపనిషత్తులు  కొన్ని సత్యాలను బోధిస్తుంది.  వేదాలు చేస్తున్నది  కూడా ఇదే కదా.  మరి ఉపనిషత్తుల ప్రత్యేక ప్రయోజనము ఏమిటి?”, అని.  ఈ కోణములో  ఆలోచిస్తే మనకు మరి కొన్ని సత్యాలు బోధ పడతాయి.  సత్యాలను సత్యాలుగా బోధించే ది వేదాలు.  సత్యాలను అనుభూతి  లోనికి తీసుకొని వచ్చేది ఉపనిషత్తులు. అంటే ఉపనిషత్తులు ఒక సాధనా స్వరూపము.  ఈ విషయాన్నే సత్య సాయి బాబా తమ భక్తులకు  బోధించినవారు.
ఈశుడు, ఈశ్వరుడు, ఈశానుడు, పరమాత్మ   ఇన్ని పేర్లతో ఉంటూ  ఉన్న ఆయన ఎవరు? ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటారు? ఆయనను ఎలా అనుభూతి చెందాలి? అన్నీ ప్రశ్నలే. కానీ మన లక్ష్యము కూడా అంత  వరకే . అంతే  కానీ అంతు  లేని తర్కముతో మన మనస్సులో ఒక వల వేసి ఆయనను పట్టుకోవాలని అను కోవడము ఒక వృధా ప్రయాస.
ప్రతి ఉపనిషత్తుకు ముందు శాంతి  మంత్రాలు ఉంటాయి. ఇవి  లోక క్షేమానికి మనము చేసే ప్రార్థన మాత్రమే కాక మన మనస్సును కూడా తృప్తి పరుస్తాయి.

ఓం  పూర్ణ  మదః  పూర్ణ  మిదం
        పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే ।
పూర్ణస్య  పూర్ణ  మాదాయ
        పూర్ణ  మేవావ  శిష్య తే ॥  


ఓంకారము  లేకుండా    మంత్రమూ  ఉండదు.ఓం  ఇతి ఏకాక్షరం  బ్రహ్మా “  అని వేద సూక్తము.  అందు వలన    మంత్ర మయినా ఓంకారము తోనే మొదలవుతుంది . ఇంక  పూర్ణ  మదః అంటే అది పూర్ణము  అయినది అని అర్థము. అంటే పూర్తి గా ఉన్నది అని అర్థము. అది అంటే మనము  కాకుండా దూరము  గా ఉన్నది అని అర్థము. ఇంక ఇదం  అంటే మనకు కనిపిస్తున్న ది, మనకు తెలుస్తున్నది, మనకు అందు బాటు  లో  ఉండేది ,మన చుట్టూ  ఉండేది, ఇది కూడా పూర్ణమే . పూర్ణాత్  () పూర్ణము (అంటే పర బ్రహ్మము ) నుండి  పూర్ణం   ఉదచ్యతే  అంటే (  పూర్ణము ) మన మున్న  విశ్వము ఉత్పన్నము అవుతున్నది.  అంతే  కాదు. పూర్ణస్య  పూర్ణమాదాయ అంటే   పూర్ణము నుండి పూర్ణమును గ్రహిస్తే  పూర్ణం  ఏవ అవ  శిష్య తే పూర్ణము మాత్రమె మిగులుతుంది. అంటే ఆ విశ్వము ఉత్పన్నమయిన  తరువాత పూర్ణము లో ఏ తగ్గుదల ఉండదు.
ఉదాహరణకు విశ్వము ఏర్పడినపుడు మూలములో  ఉన్న శక్తిలో    విధముగా గుర్తించ గలిగిన మార్పు ఉండ దు .  సముద్రములో నుండి   చెంబుతో  నీరు తీసుకున్నను సముద్రములో    విధమయిన మార్పు కనిపించదు.
ఇంక ఉపనిషత్తు లోనికి పోదాము.
మొదటి  మంత్రము:
ఈశా వాస్య మిదం  సర్వం
                    యత్కించ  జగత్యాం  జగత్ ।
తేన  త్యక్తేన  భుంజీధా
                     మా గృధః  కస్య  స్విద్ ధనమ్ ||

ఇదం సర్వం ఈశావాస్యం.
యత్కించ జగత్యాం జగత్..
తేన త్యక్తేన భున్జీథా.
కస్య స్విద్ ధనం మా గృధః.


ప్రళయ  కాలే  గచ్చతి  ఇతి జగతి. లయము చెందు నపుడు  వెళ్లి పోయేది  తరువాత సృష్టి  తో తిరిగి వచ్చేది.  ఈశా వాస్యము అంటే ఈశ్వరుడి  యొక్క  ఆవాస్యము  అంటే ఈశ్వరుడి చేత వ్యాపించ బడినది . ఏది? ఇదం సర్వమ్. అంటే మనమున్న భౌతిక రూపము  లో ఉన్న లోకము. యత్కించ  అంటే ఏది అయితే  జగత్యాం జగత్. అంటే జగత్తు నుండి వచ్చిన జగత్తు అంటే విశ్వము . అంటే బ్రహ్మాండము  నుండి వచ్చిన భౌతిక లొకము.  తేన  దానిని త్యక్తేన భుంజీధా అంటే వదిలి వేసినట్లు లేదా ఏ  బంధము లేనట్లు ఉంటూ  లేదా త్యాగ భావముతో  భుంజీధా  అంటే అనుభవిం పుము.  కస్య స్విద్ మా గృధః ధనమ్  . కస్య స్విద్ ఎవరిది అయినా  ధనము పై  మా గృధః  ఆసక్తి చూపకుము.
ఇది చాలా ముఖ్యమయిన సాధన.  మనకు వచ్చిన ధనము భగవంతుడి  అనుగ్రహము ద్వారా వచ్చినది.  దానికి మనము ధర్మ కర్తలము మాత్రమే. ధన నిర్వహణను భాద్యత గా స్వీకరిస్తూనే ధర్మ కర్తననే భావముతో ఉండుము .ఇది నాది, దీనిని నేను సంపాదించాను అన బడే  బంధాన్ని వేసుకో  వలదు.  భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడనుకున్నపుడు  సమస్త జీవ రాశులను భగవంతుడి  రూపముగా భావిస్తాము. ఈ విధముగా సమస్త జీవ రాశి  మీద మనకు ప్రేమ కరుణ ఏర్పడతాయి . ఈ అర్థము ఆచరణ  లోనికి వస్తే విశ్వమంతా శాంతి వెల్లి  విరుస్తుంది .
అంతే  కాదు. మన సంప్రదాయములోధనమగ్నిః  ధనం వాయు  దానం భూతాని పంచచఅని చెప్పబడినది. అంటే పంచ భూతాల స్వరూపము అయిన పరిసరాలను  ధనముగా భావించాలి. అందు వలన తన స్వార్థము కొఱకు పరిసరాలను  పాడు చేసే వాడిని కూడా  దొంగ గానే భావించాలి. పతంజలి యోగ సూత్రాలలో కూడా  ఆధ్యాత్మికముగా ముందుకు వెళ్ళ వలసిన వాడు అస్తేయ  బుద్ధిని అవలంబించాలి, అంటే దొంగ బుద్ధి ఉండకూడదు అని చెబుతారు. తనది కాని దానిని తనది గా భావించుట నే  స్తేయ బుద్ధి అంటారు
కానీ ఎటువంటి పరిస్థితుల లోను భాధ్యతను వదిలి పెట్ట కూడదు.

రెండవ   మంత్రము:

కుర్వ న్నేవేహ  కర్మాణి
                   జిజీవిషే చ్చతః సమాః ।  
ఏవం  త్వయి నా న్య ధే తోస్తి
           కర్మ లిప్యతే  నరే ||  

కుర్వన్ ఏవ ఇహ కర్మాణి
శతః సమాః జిజీవిషే త్
ఏవం త్వయి న అన్యథా అతః ఆస్తి
స కర్మ నరే లిప్యతే

కుర్వన్నేవేహ కర్మాణి  శతః సమాః --  కర్మాణి  కుర్వన్ ఏవ ఇహ కర్మలను (ఇహ) ఈ లోకమునందు  చేస్తూనే శతః సమాః  నూరుకు  మానమయిన సంవత్సరాలను  జిజీవిషే త్  జీవించుటకు కోరుకొన వలెను . ఏవం  ఈ విధముగా త్వయి  నీకు  నః  అన్యధః అతః ఆస్తి - మ రో రకము గా  ఏమియు లేదు  సః  అటువంటి  కర్మ   మానవుడిని  న లిప్యతే  బంధించదు .
విధి యుక్తమయిన కర్మాచరణ చేస్తూ  నూరుకు సమానమయిన సంవత్సరాలను కోరుకోవలెను .మరో విధముగా ఏమియూ  లేదు . అటువంటి కర్మ మానవుడిని బంధించదు .
సాధన: కష్టాలు వచ్చినాయి కాబట్టి  ఈ జీవితమూ బాగు లేదని,  చేయ వలసిన పనులు నచ్చ లేదని, నైరాశ్యమును పొందకూడదు . మన  పరిణామమును  అనుసరించి  మనకు ఆచరణ  విధానము లభిస్తుంది .  దానిని శ్రద్ధగా , భాద్యతగా  చేస్తే  తరువాత ఏమి చేయాలో తెలుస్తుంది . అంతే  కానీ ఒకే  సారి అన్ని మెట్లు ఎక్కి వేయాలన్న భావన తప్పే. ఒక్కొక్క మెట్టే  జాగ్రత్తగా ఎక్కాలంటే  పైన చెప్పిన మానసిక స్థితి ఉండాలి .

మూడవ  మంత్రము:

అసూర్యా  నామ తే  లోకా
                అంధేన  తమసావృతా ।
తాస్తే  ప్రేత్యాది గచ్చంత
                 యే కే  చాత్మ హానో  జనాః ॥

అసూర్యా నామ తే లోకా
అంధేన తమసావృతా
యే కేచః ఆత్మహనః జనాః
తాః తే ప్రేత్య అభిగచ్చంతి


ఇక్కడ మూలము  లో ఆసూర్య  అని ఇచ్చి,  దగ్గిర అసుర్య అని ఇచ్చినారు.  అసుర శబ్దము  నుండి  అసుర్య వచ్చింది.  సూర్య  రాహిత్యము నుండి  అసూర్య  శబ్దమువచ్చినది.  అసురులు  భౌతిక వాదానికి  ప్రాధాన్యత ను ఇచ్చే వారు. అయితే  సూర్యుడు ప్రజ్ఞకు  మూలము. అసూర్య  అంటే  సూర్యుడు లేనిది  అంటే ప్రజ్ఞ లేనిది.  అసురులుండే  లోకము తమసావృతము , లేదా చీకటితో నిండినది  కానవసరము లెదు. కానీ, సూర్యుడు లేని లోకము మాత్రము  అందు  వలన అంథేన అంటే గ్రుడ్డి తనము వలన తమసావృతమే అంటే చీకటి తో నిండినది.
యే కేచ అంటే ఎవరయితే ఆత్మ హనః అంటే ఆత్మను చంపుకున్న వారు అనే కంటే ఆత్మ తత్వమును చంపుకున్న వారు అనుట సబబు గా ఉంటుంది. జనాః అటువంటి జనము అసూఠ్యాః నామ అంటే సూర్యుడు లేనటువంటి అంథేన తమసావృతాః గ్రుడ్డి తనము వలన చీకటి తో నిండిన తేః లోకాః అంటే ఆ లోకములను ప్రేత్య అంటే మరణించి అభిగచ్చంతి అంటే మరల మరల పొందుతున్నారు.
తాత్పర్యము: ఆత్మ ద్రోహము చేసుకున్న వారు మరణము తరువాత సూర్యుడు లేని అజ్ఞాన అంధ కారములతో కూడిన లోకములకు పోయి మరల మరల అవే లోకములను పొందెదరు.
వివరణ: వేర్వేరు లోకములన్నీ ఒక దానితో ఒకటి కలసే యుండును. తక్కువ స్థాయి జీవితమును గడిపిన వారు అందుకు తగినట్లు గా తక్కువ స్థాయి పౌనఃపున్యము కలిగిన చీకటి లోకములకు పోయి తాము ఉత్తమ పరిణామ స్థాయికి ఎదిగే వరకు అక్కడికే పోవుచుండెదరు. మానసిక స్థాయి ఎదిగితే అందుకు తగిన సత్కర్మ చేసి ఉత్తమ లోకములను పొందెదరు.

నాల్గవ మంత్రము:
అనేజదేకం మనసో జవీయో
నైనద్దేవా అప్నువన్ పూర్వమర్షత్ |
తద్దావతోsన్యానత్యేతి తస్మత్
తస్మిన్నపో మాతరిశ్వా దదాతి ||

ఏకం మనసో జవీయో అనేజత్
న ఏనః దేవాః పూర్వమర్షత్ అప్నుఫన్
తత్ అన్యాన్ అత్యేతి దావతి
తత్ తిష్టతి
తస్మిన్ మాతరిశ్వా ఆపః దధాతి

ఏకం అంటే అతడు ఆ పరమేశ్వరుడు మనసో జవీయో అంటే మనసు కంటే వేగముగా జవీయో అంటే వెళ్ళ గలడు. ఏనః అంటే దీనిని దేవాః దేవతలు పూర్వమర్షత్ ఈ ప్రాచీనమయిన జ్ఞానమును న అప్నువన్ పొంద లేక పోయినారు.అన్యాని అత్యేతి ధావతి అంటే ఇతరులను అతిక్రమించి పరుగెట్ట గలదు. తిష్టతి అంటే కదలకుండా ఉండ గలదు. తస్మిన్ ఇందు వలననే మాతరిశ్వా వాయువు లాంటి దేవతలు ఆపః జలమును లేదా వర్షాదులను దదాతి సమకూర్చ గలిగినారు.
తాత్పర్యము: తను స్థిరముగా ఉంటూనే మనస్సు కంటే ఎక్కువ వేగము కలిగిన వాడు. అతడి జ్ఞానమును ఇంద్రాది దేవతలు కూడా పొంద లేక పోయినారు. తను స్థిరముగా ఉంటూనే అత్యంత వేగముగా సాగుతున్న ఇతరులను దాటి పోగలడు అతడి ఉనికి వలననే వాయువు లాంటి దేవతలు వర్షము సమకూర్చ గలుగుతారు.

ఆధునిక విశ్వాసమును అనుసరించి ఒక వివరణ: ఏ కణము కూడా వేగము పెరిగే కొద్దీ దాని వ్యాపకత కుంచించుక పోతుందనేది ఆధునిక విజ్ఞానములో తెలిసిన విషయము. వేగము శూన్యము అయినపుడు దాని వ్యాపకత అనంతము వరకు పెరుగుతుంది. ద్రవ్యము యొక్క తరంగ దైర్ఘ్యము దాని వేగమునకు విలోమ నిష్పత్తిలో ఉంటుంది. (ఆధునిక కాలములో దీనిని గమనించినది లూయిస్ డీ బ్రాగ్లీ). అంతే గాక ఒక్క చోటనే కూర్చుని అనంత విశ్వములో ఎక్కడ ఏమి జరుగుతుందని తెలుసుకో గలిగిన యోగి కూడా ఈ ఆధారము మీదే పని చేస్తాడు. ఆల్ఫా ధ్యానము లాంటి ప్రక్రియ ఇటువంటి ఫలితాలని ఈయ గలదు. స్థిరముగా యున్న ఈశ్వరుడు అంతటను వ్యాపించి అంతటను తనలో ఇముడ్చుకో గలదు.
శివ సహస్ర నామములలో మొదటి నామము స్థిరుడు. తను స్థిరముగా యుంటూ సర్వమును గమనించ గలుగుట ఒక అద్భుత సాధన. విజ్ఞాన భైరవ తంత్రములో కూడా ఈ విషయము చెప్ప బడి యున్నది.

అయిదవ మంత్రము:
తదేజతి తన్నైజతి.
తద్ దూరే తద్వంతికే |
తదంతరస్య సర్వస్య
తదు సర్వస్యాస్య బాహ్యతః ||

తత్ ఏజతి తత్ న ఏజతి
తద్ దూరే తద్ అంతికే
తద్ అంతరస్య సర్వస్య
తత్ సర్వస్య అస్య బాహ్యస్య

తదేజతి అతడు నడుస్తాడు. తత్ న ఏజతి. అతడు నడువదు. తత్ దూరే అతడు దూరములో ఉన్నాడు. తత్ అంతికే అతడు సమీపములో కూడా ఉన్నాడు. తత్ అంతరస్య సర్వస్య సమస్త జగత్తు లో లో లోపల ఉన్నాడు. తత్ సర్వస్య అస్య బాహ్యస్య. అతడు అన్నిటికి బయట కూడా ఉన్నాడు.
తాత్పర్యము: ఆ పరమ పురుషుడు నడుచును, నడవడు,చాల దూరముగా ఉన్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడు. జగత్తు లోపల జగత్తుకు బయట పరిపూర్ణముగా ఉన్నాడు.
వివరణ: పరిస్థితులు ప్రవర్తనను నిర్దేశిస్తాయి, కానీ భగవంతుడు ఎప్పుడూ ఒకే రకముగా ఉంటాడు. సగుణ రూపములో తీసుకుంటే నడచినట్లుంటాడు. నిర్గుణ రూపములో చలనముండదు. నమ్మకము లేని వాడికి దూరముగా ఉంటాడు, భక్తులకు దగ్గిరగా ఉంటాడు. జగత్తుకు లోపల బయట అన్ని చోట్లా ఆయనే ఉంటాడు. ఆయన సర్వ వ్యాపి.
ఆరవ మంత్రము:
యస్తు సర్వాణి భూతా
న్యాత్మనే నాను పస్యతి |
సర్వ భూతేషు చాత్మానం
తతో న విజుగుప్సతే ||

యః తు ఎవరయితే సర్వాణి భూతాని సమస్త జీవ రాశులను ఆత్మన్యే పరమాత్మ యందు అనుపశ్యతే దర్శించ గాలుగుతున్నాడో అతడు సర్వ భూతేషు ఆత్మానం సకల ప్రాణులందు పరమాత్మనుచూస్తాడు. తతః తరువాత విజుగుప్సతే ద్వేషించడు.
తాత్పర్యము: సకల జీవులను పరమాత్మ యందు చూచు వాడు మరియు సకల జీవుల యందు పరమాత్మను చూచు వాడు ఏ జీవిని ద్వేషించడు.
ఈ విధముగా జీవించుట ఒక అద్భుతమయిన సాధన.

ఏడవ మంత్రము:
యస్మిన్ సర్వాణి భూతాని
ఆత్మనా భూ ద్విజానత |
తత్ర కో మోహః కో శోకః
ఏకత్వ మను పశ్యతి ||
యస్మిన్ ఎప్పుడయితే సర్వాణి భూతాని సకల ప్రాణులను ఆత్మ ఆభూత్ పరమాత్మ స్వరూపముగా విజానతః విశేషముగా తెలుసుకున్నపుడు అస్మిన్ ఆ స్థితిలో తత్ర అక్కడ కో మోహః మోహమేక్కడిది? కో శోకః శోకమేక్కడిది?ఏకత్వం అనుపశ్యతి ఒకే తత్త్వము చూస్తాడు.
తాత్పర్యము: సకల ప్రాణులను పరమాత్మ స్వరూపముగా తెలిసిన స్థితిలో అక్కడ మోహము ఎక్కడిది? శోకము ఎక్కడిది? అక్కడ ఏకత్వ స్థితిని అనుభవిస్తాడు.
ఇది అద్వైత భావానికి పరాకాస్థ.

ఎనిమిదవ మంత్రము:
స పర్యగా చ్చుక్ర మకాయ మవ్రణం
అస్నావిరః శుద్ధ మాపాప విద్ధం |
కవిర్మనీషీ పరిభూః స్వయం భూర్యాథా
తథ్యతోర్ధాన్ వ్యదధా చ్ఛాశ్వతీభ్యః సమాభ్యః ||


సః అతడు పర్యగాత్ సర్వ వ్యాపి అవుతాడు. శుక్రం తేజస్సు కలిగిఉంటాడు. అకాయం నిర్గుణ స్వరూపుడుగా ఉంటాడు. అవ్రణం గాయములు లేకుండా ఉంటాడు అస్నారం నరములు లేని వాడుగా ఉంటాడు. శుద్ధం శుభ్రముగా ఉంటాడు.అపాప విద్ధం కర్మ దోషములు లేని స్థితిని పొందును. కవి అన్నిటినీ చూడ గలుగును మనీషీ జ్ఞానిగా ఉందును పరిభూః అందరికంటే గొప్ప వాడుగా ఉందును స్వయంభూః స్వయముగా ప్రకటించుకొన గలిగిన వాడుగా ఉందును శాశ్వతీభ్యః శాశ్వతమయిన వాడుగా ఉందును.యథాతథ్యత ఉండ వలసిన రీతిలో అర్ధాన్ పదార్థములను శాశ్వతీభ్యః అనాది అయిన సమాభ్యః కాలమునుండి వ్యదథాన్ ఏర్పాటు చేయుచుండును.
తాత్పర్యము:ఈ విధముగా సమస్త జీవులలో భగవంతుడిని చూడ గలిగిన వ్యక్తీ తేజస్సుతో దేహ భ్రాంతి వదలి స్నాయువులు గాయములు లేని వాడయి పరమేశ్వరత్వమును పొందును. అతడు అన్నిటిని చూడ గలదు, తెలుసుకోన గలదు, స్వయముగా ప్రకటించు కొనగలడు, శాశ్వతుడు, సమస్త ప్రాణులకు కావాల్సిన పదార్థములను అందించ గలడు.
ఇది ఆ మార్గములో వెళ్ళు వ్యక్తీ అందుకొనే స్థితిని తెలియ చేస్తుంది.

తొమ్మిదవ మంత్రము:
అంధం తమః ప్రవిశంతి
యే s విద్యాముపాసతే |
తతో భూయ ఇవ తే తమో
య ఉ విద్య యా రతాః ||

యః అవిద్యా ముపాసతే ఎవరయితే అవిద్యా మార్గమును ఉపాశిస్తారో వారు అంధం తమః ప్రవిశంతి చీకటి లోకాలలో ప్రవేశిస్తారు. యే విద్యాయాగ్ం రతాః ఎవరయితే విద్య మార్గము నందు ఆసక్తులై ఉంటారో తే వారు తతో భూయ ఇవ తమః అంత కంటే చీకటి లోకాలను ప్రవేశించెదరు. ఇక్కడ అవిద్య మార్గము అంటే కర్మ మార్గము. యఙ్ఞ, దాన, తపో కర్మలను ఈ మార్గములో ఆచరించు వారు చీకటి లోకాలలో ప్రవేశించెదఠు. ఇది అవిద్యా మార్గము అంటే వారు స కాములై అంటే తమ కోరికల కొరకు ఎన్నుకొన్న మార్గము అవుతుంది. పై కర్మలు నిష్కామముగా చేసినపుడు మరో రకముగా ఉంటుంది. మరి విద్య యందు రతులయిన వారు ఇంతకంటే చీకటి లోకాలలో కి పోవడము ఏమిటి? ఈ విషయములో వివరణలో వైవిధ్యము కాన బడుతున్నది. ఇక్కడ ఒకే ఒక్క పదము రతాః ఆ వైవిధ్యమును తోసి పుచ్చుతుంది. అంటే జ్ఞాన మార్గము కూడా అవసరాన్ని మించిన ఆసక్తితో అనుసరించిన వారు కూడా బంధాలలో చిక్కుకుంటారు. వారిలో తమకు అన్నీ వచ్చు అన్న అహంకారము కలుగ వచ్చును. లేదా లోకానికి అవసరమయిన క్రతువులను వారు నిరసించ వచ్చును. ఈ విధముగా రెండు మార్గములలో భంగ పాట్లు ఉన్నవి. రెండు మార్గములలో తుల్యతను పాటించిన వారికి ఎటువంటి సమస్యలు ఉండవు.
తాత్పర్యము: కర్మ మార్గమును స కామముగా ఆచరించు వారు చీకటి లోకములలో కి పోవుదురు. జ్ఞాన మార్గములో అత్యంత ఆసక్తి తో ఉన్న వారు కూడా బంధనాలలో చిక్కుకొని మరింత చీకటి లోకాలలోకి పోవుదురు.
పదియవ మంత్రము:

అన్య దేవాహుర్విద్యయా
న్యదాహురవిద్యయా |
ఇతి శుశ్రుమ ధీరాణాం
యేనస్తద్ విచచక్షిరే ||

విద్య యా అన్యత్ ఎవ ఆహు జ్ఞాన మార్గము ద్వారా అన్యత్ అంటే వేరే ఫలమును ఆహు అంటే చెప్పెదరు. అవిద్యయా కర్మ మార్గము ద్వారా యదాహు ఇదే విధముగా అంటే వేరే ఫలమును చెప్పెదరు.ఇతి అంటే ఈ విధముగా (మేము ) ధీరాణామ్ బుద్ధి మంతుల ద్వారా శుశ్రుమ విన్నాము. తత్ దానిని యేన మాకు విచచక్షిరే వివరించి చెప్పినారు.
తాత్పర్యము: మేము బుద్ధిమంతుల ద్వారా విన్న దాని ప్రకారము కర్మ మార్గము ద్వారా ఒక రక మయిన ఫలితములు జ్ఞాన మార్గము ద్వారా వేరొక రకమయిన్ ఫలితములు వచ్చును. దీనిని వారు వివరించి చెప్పిరి.


పదకొండవ మంత్రము:

విద్యాం చా విద్యాం చ
యస్తద్వేదోభయం సహః |
అవిద్యయా మృత్యుం తీర్త్వా
విద్యయామృత మశ్నుతే ||

విద్యాం చ విద్య అంటే జ్ఞాన మార్గము మరియు అవిద్యాం చ అవిద్య మార్గము అంటే కర్మ మార్గము యః తః ఏదో అది ఉభయం రెండింటిని వేద తెలుసు కున్న వారు అవిద్యయా కర్మ మార్గములో మృత్యుం మరణాన్ని తీర్త్వా దాటి విద్య జ్ఞాన మార్గము ద్వారా అమృత మశ్నుతే అమృతత్వమును పొందెదరు.
తాత్పర్యము: ఎవరయితే విద్య మరియు అవిద్య మార్గములు రెండింటిని గురించి తెలిసి ఆచరిస్తారో వారు మొదటి (కర్మ ) మార్గము ద్వారా మృత్యువును దాటుతారు. విద్య అంటే జ్ఞాన మార్గము ద్వారా (మృత్యువంటే తెలుసుకొని ) మృత్యువుకు అతీతమయిన స్థితిని అందుకుంటారు.
అంటే కర్మ మార్గములో చావును దాటుతారు కానీ చావుకు అతీతులు కాలేరు. చావు మరో జన్మకు వారధి అని తెలుసుకున్న జ్ఞానులు మృత్యు రహిత స్థితిని అంగీకరించ గలుగుతారు.

పన్నెండవ మంత్రము:

అంధం తమః ప్రవిశంతి
యే s సంభూతి ముపాసతే |
తతో భూయ ఇవ తే తమో
య ఉ సంభూత్యాః రతాః ||

ఒక వ్యాఖ్యానమును అనుసరించి సంభూతి అంటే ఆవిష్కరించ బడినది.. ఆంగ్లములో దీనికి manifested అనే పదమును వాడినారు. అదే విధముగా అసంభూతి అంటే ఆవిష్కరణ కానిది.( unmanifested )యే అసంభూతిముపాసతే అంధం తమః ప్రవేశంతి. అంటే యే ఎవరయితే అసభూతిముపాసతే అంటే ఆవిష్కృతము కాని దానిని అంటే ప్రకృతి శక్తులను ఉపాసిస్తారో వారు అంధం తమః ప్రవిశంతి అంటే కటిక చీకటిలో ప్రవేశిస్తారు. య సంభూత్యాః రతాః య ఎవరయితే సంభూత్యాః రతాః


                    ఆవిష్కృతమయిన ప్రపంచముతో అనుబంధము పెంచుకుంటారో తే వారు ఉ కూడా భూయ బహుళమైన లేదా ఎక్కువయినా ఇవ తమః అటువంటి చీకటిని (ప్రవేశిస్తారు ).
ఇక్కడ మొదట ఉపాసతే అను పదమును వాడినారు. రెండవ చోట రతాః అనే పదమును వాడినారు. మొదటిది ఆరాధన, రెండవది అనురక్తి అంటే బంధము. బంధము ఎప్పుడూ చీకటి లోనికి దారి తీస్తుందనే విషయము జగద్విదితమే. ఉపాసనతో ఆనందము కలుగ వచ్చును. అంతే గాక శక్తులను ఇస్తుంది. అనురక్తి బంధాన్ని పెంచుతుంది. కాని ప్రకృతి ఉపాసన వలన భగవంతుడి వైపు చేరే లక్ష్యము ఉండదు. అందు వలన రెండింటి లోనూ చీకటిలో ప్రవేశిస్తారు. తరువాత చెప్ప బడిన ప్రకారము ఎక్కడయితే బంధము ఏర్పడదో అది భగవంతుడి దగ్గిరకు చేర్చుతుంది.
తాత్పర్యము: ప్రకృతి ఆరాధన వలన :చీకటి లోకాలలో కి వెళ్ళతాము. అదే ఆవిష్కృత ప్రపంచముతో అనుబంధము వలన మరింత చీకటి లోకాల లోకి ప్రవేశిస్తాము.


పదమూడవ మంత్రము:
అన్య దేవాహహుః సంభవా
దన్య దాహురసంభవాత్ |
ఇతి శుశ్రుమ ధీరాణాం
యేనస్తద్ విచచక్షిరే ||

అన్యత్ ఏవ ఆహుః సంభవాత్ ఆన్యత్ ఏవ మరో రకముగా సంభవాత్ ఆవిష్కృతమయిన వాటి గురించి ఆహుః చెప్పా బడినది. అసంభవాత్ ఆవిష్కృతము కాని వాటిని గురించి అన్యత్ మరో రకముగా ఆహుః చెప్పబడినది. ధీరాణాం విజ్ఞుల నుండి ఇతి శుశ్రుమ ఈ విధముగా వింటున్నాము. ఏనః తత్ విచ చక్షిరే అది ఆ విధముగా వివరించ బడినది.
తాత్పర్యము:ఆవిష్కృత మయిన వాటి పై సాధన గురించి ఒక విధముగా ఆవిష్కృతము కాని వాటి గురించి మరో విధముగా చెప్ప బడినది. ఈ విధముగా విజ్ఞులు చెప్పగా విన బడినది.


పదునాల్గవ మంత్రము:

సంభూతిం చ వినాశం చ
యస్తద్వేదోs భయః సహ |
వినాశేన మృత్యుంతీర్త్వా
సంభూత్యామృత మశ్నుతే ||

సంభూతిం ఆవిష్కృత ప్రపంచమును చ మరియు వినాశం అంటే లయము లేదా ప్రళయమును ఉభయః సహ రెండింటిని గురించి తత్ దానిని వేదః తెలుసుకున్న వాడు భయాపహ భయమును వదలి వినాశేన నాశనము వలన మృత్యుమ్ మృత్యువును తీర్త్వా దాటి సంభూత్యా ఆవిష్కృతము అయిన ప్రపంచము ద్వారా అమృతత్వమును అశ్నుత పొందును.
తాత్పర్యము: ఎవరయితే ఆవిష్కృతము మరియు వినాశము గురించి తెలుసుకుంటారో వారు వినాశము ద్వారా మృత్యువును దాటి ఆవిష్కృత ప్రపంచము ద్వారా అమృతత్వమును పొందెదరు.
ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. వినాశము ద్వారా మృత్యువును ఎలా దాటుతారు?
కాస్త వివరణ: ఇక్కడ ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఒక వ్యాఖ్యానములో మొదటి పాదములో సంభూతి కి బదులు అసంభూతి ఉంటే కాస్త అర్థ వంతముగా ఉంటుందని సూచన ఈయ బడినది. కాని ఇది వేద పాఠములో భాగముగా ఋషుల ద్వారా దర్శించ బడి ఛందస్సులో బంధించ బడిన శ్లోకము లేదా మంత్రము. అందులో సవరణ చేయాలంటే చాలా ధైర్యము కావలసి యుంటుంది. అయితే సహజముగా భారతీయ ఋషి సంస్కారానికి సంబంధించిన వారికి పునర్జన్మ మీద నమ్మకము ఉంటుంది. వినాశనము ద్వారా మృత్యువును దాటుట ద్వారా తిరిగి జన్మ ఎత్తుతారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వ్యక్తీ తనకు మృత్యువు అనేది లేదన్న విషయాన్ని గుర్తిస్తాడు. అమృతత్వమ్మును పొందటము అంటే ఇదే. ఇది పరోక్షముగా పునర్జన్మను సూచిస్తుంది.

పదిహేనవ మంత్రము:

హిరణ్మయేన పాత్రే ణ
సత్యస్యాపి హితం ముఖం |
తత్త్వం పూషన్నపావృణు
సత్య ధర్మాయ దృష్టయే ||

హిరణ్మయేన బంగారుతో నిండిన లేదా బంగారు రంగుతో కూడిన పాత్రేణ పాత్ర వలన సత్యస్య ముఖం సత్యము యొక్క ముఖము అపిహితం అంటే మూయ బడినది. సత్య ధర్మాయ ధృష్టయే సత్యము మరియు ధర్మములను సరిగా చూచి ఖచ్చితముగా ఉండుటకు లేదా సరిగా చూచి నిర్ణయించుట కొరకు పూషన్ పోషణ భాద్యతను స్వీకరించిన దేవా! తత్ దానిని త్వం మీరు అపావృణు తొలగించుము.
తాత్పర్యము: ఓ పరమేశ్వరా! నీ యొక్క సత్య రూపమయిన ముఖము బంగారు పాత్ర చేత మూయ బడినది. సత్య ధర్మములను నిర్ధారించు కొనుటకు ఆ (తేజస్సును) తొలగించుము.(అప్పుడు మీ ముఖమును మేము చూడ గలము. )
ఇక్కడ భగవంతుడి రూపము బంగారు కాంతితో ఉన్నట్లు చూపించ బడినది. ఇది సాధకుడికి నిరంతరమయిన కోరికగా ఉండ వలయును.


పదునారవ మంత్రము:

పూషన్నేకర్షే యమ సూర్య ప్రాజాపత్య
వ్యూహ రశ్మీన్ సమూహ |
తేజో యత్తే రూపం కళ్యాణ తమం పశ్యామి
యో సావసౌ పురుషః సోహమస్మి ||

పూషన్ పోషించు వాడా! ఏకర్షే ఏకైక జ్ఞాన స్వరూపా! యమ సూర్య ప్రాజాపత్య రశ్మిన్ యముడు, సూర్యుడు, ప్రజాపతి మున్నగు వారి కిరణములను సమూహ ఏకత్వమును పొందించునది వ్యూహ విశేష మయిన పధ్ధతి కలది. యత్ ఏదయితే తే నీ యొక్క తేజో రూపం తేజస్సుతో కూడిన రూపము కళ్యాణ తమం మంగళాన్ని కలిగించునది పశ్యామి చూచుచున్నాను. అసౌ పురుషః ఆ పురుషుడిని పశ్యామి చూచుచున్నాను. సః అతడే అహం నేను అస్మి అయి ఉన్నాను.
తాత్పర్యము: ఓ సర్వ పోషకుడా! ఏకైక జ్ఞాన స్వరూపా! సర్వ నియంతా!(యమ) లక్ష్య ప్రదాతా! (సూర్య) సృష్టి ప్రదాతా!(ప్రజాపతి) కళ్యాణ తమ మయిన నీ యొక్క తేజో రూపాన్ని చూచుచున్నాను. అదే పురుష రూపము. నేను కూడా ఆ రూపాన్నే.
ఇది అద్వైత సిద్ధాంతానికి పూర్ణ రూపము.

పదిహేడవ మంత్రము:

వాయురనిల మమృతమమథేదం
భస్మాంతః శరీరమ్ |
ఓం క్రతో స్మర కృతః స్మర
క్రతో స్మర కృతః స్మర ||

అథ ఇప్పుడు వాయురనిల పంచ ప్రాణముల తో కూడిన వాయువు ౪౯ విభాగాలుగా ఉన్న సమిష్టి వాయు తత్త్వము అయిన అనిలము తో కలిసి పోవు గాక. ఈ శరీరము భస్మమగు గాక. ఓం క్రతోః యజ్ఞ స్వరూపా! స్మర నన్ను గుర్తుంచు కొనుము. కృతః స్మర చేసిన వాటిని గుర్తుంచు కొనుము.
తాత్పర్యము: ఓం పరమేశా! ఇప్పుడు (నా మరణము తరువాత ) నా పంచ ప్రాణాలు సమిష్టి వాయు తత్వములో కలిసి పోనీ. నా భౌతిక శరీరము భస్మ కృతము అగు గాక. యజ్ఞ స్వరూపా! నన్ను గుర్తుంచుకొనుము. నేను చేసిన పనులను గుర్తుంచుకొనుము.

పదుఎనిమిదవ మంత్రము:

అగ్నే వయ సుపథా రా యే అస్మాన్
విశ్వాని దేవ వయునాని విద్వాన్ |
యుయోధ్య స్మజ్జు హురాణమేనో
భూయిష్థాం తే నమ ఉక్తిం విధేమ ||

అగ్నే! అగ్ని దేవతా! అస్మాన్ మమ్ములను సుపదా మంచి మార్గములో రాయే కర్మ ఫలితములనండుకోనుతకు నయ నడిపించుము. దేవ పరమేశ్వరా! విశ్వాని వయునాని ప్రపంచములో అన్ని కర్మలను ధ్యానములను విద్వాన్ తెలిసిన వాడవు. అస్మత్ మా యొక్క జుహురాణం ప్రతిబంధకాలను ఏనః సంబంధించిన ( పాపాలను) యుయోధి తొలగించుము. తే నీకు భూయిష్థామ్ పదే పదే లేదా మరల మరల నమ ఉక్తిం నమస్కార వాక్యములను విధేమ పలుకుచున్నాము.
తాత్పర్యము: అగ్ని దేవా! మమ్ములను మంచి మార్గములో కర్మ ఫలములను అందుకొను నట్లుగా నడిపించుము. నా కర్మలను నీవు ఎరుగుదువు. నా మార్గములో అడ్డంకులను తొలగించుము. మీకు పదే పదే నమస్కారములు చెబుతాము.


No comments:

Post a Comment